ప్రతిజ్ఞ చేస్తున్న ఎల్ఐసి ఉద్యోగులు
ప్రజాశక్తి-గుంటూరు : దేశంలో 1956లో 245 ప్రైవేటు బీమా కంపెనీల విలీనం ద్వారా ఏర్పడి ఎల్ఐసి ఆనాటి నుండి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ బీమా మార్కెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిందని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శి వివికె.సురేష్ అన్నారు. జాతీయకరణ దినోత్సవం సందర్భంగా స్థానిక అరండల్పేటలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 23 ఏళ్ల నుండి 25 బీమా కంపెనీలతో వ్యాపార పోటీలో ఉన్న ఎల్ఐసి నేడు రూ.45.4 లక్షల కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యున్నత ఆర్థిక శక్తిగా ఎదిగిందని అన్నారు. వివిధ రంగాలకు కోట్లాది రూపాయాల పెట్టుబడుల్ని ఎల్ఐసి సమకూరుస్తున్న నేపథ్యంలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు వంటి పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎల్ఐసి మరింత శక్తివంతం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమానికి జె.రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా అన్ని సవాళ్లను అధిగమించి ప్రభుత్వ రంగ ఎల్ఐసిని కాపాడుకుంటామని అధికారులు, ఉద్యోగులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. గుంటూరులోని మూడు ఎల్ఐసి కార్యాలయాల వద్ద జరిగిన పలు కార్యక్రమాల్లో జి.శివరామకృష్ణరావు, ఐ.వెంకట్రావు, డి.సైదులు, ఎస్.సుధారాణి, పి.ఆర్.రాజశేఖర్, కె.సీతారామాంజనేయులు, సిహెచ్.మధుబాల, ఎ.ఉషాబాల, పి.శ్రీదేవి పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/gnt-3-3.jpg)