ప్రజాశక్తి – సామర్లకోట రూరల్గుణ్ణం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్, సాధారణ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. స్థానిక పూర్ణ కళ్యాణ మండపంలో రెండు రోజులపాటు జరిగే ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ మాజీ ఛైర్మన్, సీనియర్ వైద్యులు డాక్టర్ చండలాడ అనంత పద్మనాభం మంగళవారం ప్రారంభించారు. ట్రస్టు అధినేత గుణ్ణం చంద్ర మౌళి అధ్యక్షత వహించారు. హైదరాబాదుకు చెందిన ”గ్రేస్ ఫౌండేషన్” సహకారంతో ఒక్కో వాహనంలో రూ. 7 కోట్లు విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన రెండు బస్సులను ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా వైద్య పరీక్షలను చేపట్టారు. అన్నిరకాల క్యాన్సర్ బలహీనతలను పరీక్షలు, స్కానింగ్ల ద్వారా గుర్తించి వారికి ఎలాంటి చికిత్సలు అవసరమో రోగులకు అవగాహన కల్పించడంతోపాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. కేవలం క్యాన్సర్ వ్యాధికి మాత్రమే గాక సాధారణ వ్యాధులు, ఎముకుల వ్యాధులు, గర్భకోస వ్యాధులకు సంభందించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన మొదటి రోజు శిబిరంలో 429 మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, ఉభయ తెలుగు రాష్ట్రాల మున్సిపల్ కౌన్సిలర్ ఛాంబర్ మాజీ ఛైర్మన్ డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర, మాజీ ఎంపి చిట్టూరి రవీంద్ర, సాన సతీష్, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ వైస్ ఛైర్మన్లు నెక్కంటి సాయి, ఊభా జాన్ మోసెస్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్లు గోలి వెంకట అప్పారావు చౌదరి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి (బాబు), తదితరులు పాల్గొన్నారు.