ఫొటో : తహశీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న ఎండియు ఆపరేటర్లు
ఎండియు ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఎండియు ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ జగదీష్బాబుకు ఎండియు ఆపరేటర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేలి ముద్రల వల్ల హెల్పర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. పనిభారం పెరిగి హెల్పర్లు రావడం లేదని తెలిపారు. వేలిముద్రల విధానాన్ని తొలగించి ఇదివరకులాగే ఒకే వేలిముద్రతో నిత్యావసర సరుకులు వచ్చే విధంగా చేయాలని, లేనిపక్షంలో ఒక వేలిముద్ర తీసుకొని బియ్యం మాత్రమే పంపిణీ చేస్తామని తెలిపారు. అంగన్వాడీ, మిడ్ డే మీల్స్కు సంబంధించి గడిచిన సంవత్సర కాలం కమిషన్లు ఇంతవరకు చెల్లించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కేజీకి రూ.1.50 పైసలను చెల్లించకుండా సాకులు చెబుతూ పది పైసలు చెల్లించి డీలర్లకు ఏమో కేజీకి రూ.1 చెల్లిస్తుందన్నారు. తమకు కనీసం హమాలీలకు, పెట్రోల్ ఖర్చులకు కూడా రావడం లేదదన్నారు. ఈ పని భారం మోయలేమని, పూర్తిగా అంగన్వాడీలను, మిడ్ డే మీల్స్కు సంబంధించి సరుకులను ఫిబ్రవరి నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు మరణించిన 67మంది ఎండియు ఆపరేటర్లకు రూ.5లక్షలు ఎక్స్గ్రేషియోను ప్రభుత్వం చెల్లించి వారి కుటుంబాలను రోడ్డు మీద పడకుండా కాపాడాలని కోరారు. కార్యక్రమంలో డి.పెంచల ప్రసాద్, ఎన్ శ్రీకాంత్, ఎస్డి జమీర్, సిహెచ్.శ్రీనివాసులు, సునీల్, పవన్కుమార్, బి.రాజు, వై.కళ్యాణ్, వి.సుబ్బారెడ్డి తదితరులున్నారు.