ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు పాటించాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి – ఏలూరు

జిల్లా ఓటరు జాబితా సాధనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొని జిల్లాకు సంబంధించిన డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ రోజున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న ఫారాలు, ఎస్‌ఎస్‌ఆర్‌-2024 సమయంలో స్వీకరించిన ఫారాలు, అనోమలిస్‌ పెండింగ్‌, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, పెండింగ్‌ రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఇరోల్‌పై రిపోర్ట్‌లు, ఎపిక్‌ కార్డుల జనరేషన్‌, పంపిణీ, పిఎస్‌ఇలు, డిఎస్‌ఇలు, తదితర అంశాలపై ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల అధికారికి కలెక్టర్‌ వివరించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్ధేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు నమోదుపై వచ్చేనెల రెండు, మూడు తేదీల్లో ప్రత్యేత ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా అంతటా నిర్వహించి ఇంకా అర్హతున్న ఓటర్లను గుర్తించి నమోదు చేయించి నాణ్యమైన ఓటరు జాబితాను రూపొందించాలని తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రత్యేక ఓటరు నమోదుకు బూత్‌ లెవిల్‌ ఆఫీసర్స్‌ తమ బూత్‌లలో ఆ తేదీల్లో ఉండి నమోదు ప్రక్రియను చేపట్టాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇఆర్‌ఒలు కె.బాబ్జీ, సత్యనారాయణమూర్తి, గీతాంజలి, తహశీల్దారు సోమశేఖర్‌, సిపిఒ శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ చల్లన్న దొర పాల్గొన్నారు.

➡️