కార్మికులకు మద్దతు తెలుపుతున్న సిపిఎం, సిఐటియు నాయకులు
ప్రజాశక్తి-తాడేపల్లి : ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులకు సిపిఎం, సిఐటియు తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం నాయకులు జొన్నా శివశంకరరావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, సిఐటియు తాడేపల్లి కార్యదర్శి వేముల దుర్గారావు తెలిపారు. ఆదివారం సిమెంటు ఫ్యాక్టరీ యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన కార్మిక కుటుంబాలు జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటి ముందుకు వచ్చే వారిని నిలదీయాలని సూచింకారు. కోర్టు తీర్పు ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదని, కార్మికుల సమస్య పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని ఆయా రాజకీయ పార్టీల నాయకులకు స్పష్టం చేయాలన్నారు. ఏళ్ల తరబడి సమస్య పరిష్కారానికి నోచుకోకపొవడంతో కార్మికులందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని యూనియన్ కార్యదర్శి కూరపాటి స్టీవెన్ తెలిపారు. కార్మికులకు రావాల్సిన బాకాయిలు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/tpl-2-1.jpg)