ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమల రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఓటు యొక్క ఆవశ్యకత, విశిష్టత గూర్చి అవగాహన కల్పించేందుకు విజ్జి స్టేడియంలో వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి ఓటు ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం వంటిదని అన్నారు. ఓటుకు మించిన ఆయుధం వేరొకటి లేదని అన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా పోలింగ్ రోజున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, పారిశుధ్య పర్యవేక్షకులు బాలకృష్ణ, సలీం రాజు, రామకృష్ణ, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.