సావరనీర్ను ఆవిష్కరిస్తున్న వీసీ తదితరులు
ప్రజాశక్తి – ఎఎన్యు : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసే ఔషధాలు తరచూ విఫలం అవ్వడానికి గల కారణాలను యువ ఫార్మసిస్టులు పరిశోధించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ పి.రాజశేఖర్ సూచించారు. వర్సిటీలోని ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ‘కరెంటు డ్రగ్ డెలివరీ టెక్నాలజీస్ – ఇన్నోవేషన్స్ అండ్ అప్లికేషన్స్’ అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. వీసీ మాట్లాడుతూ ఔషధాల తయారీకి ప్రాచీన మార్గాలను అనుసరించాలని సూచించారు. సదస్సుకు ముఖ్య ఉపన్యాసకులుగా పాల్గొన్న ఫార్మాసూటికల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రాజభాను మాట్లాడుతూ అంతర్జాతీయ ఔషధ ఎగుమతుల్లో భారతదేశ స్థానాన్ని ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చిన్నారులకు ఆమోదించే ప్రతి మూడు వాక్సిన్లలో ఒకటి భారతదేశ ఉత్పత్తి చేస్తుందని అన్నారు. ఆఫ్రికాకు సరఫరా అయ్యే 50 శాతం పైగా జనరిక్ ఔషధాలను మన దేశం ఎగుమతి చేస్తోందన్నారు. హైదరాబాదులోని నైపర్ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గోడుగు చంద్రయ్య మాట్లాడుతూ కేన్సర్ చికిత్సకు ఉపయోగించే హాన్ఫోటెరీషియన్-బి అనే ఔషధాన్ని లైపోస్మల్ ఫార్ములేషన్గా ఇవ్వడం వల్ల కిడ్నీలకు కలిగే దుష్పరిమానాన్ని తగ్గించవచ్చని అన్నారు. అనంతరం వివిధ అంశాలపై రిజిస్ట్రార్ బి.కరుణ, ఒఎస్డి కె.సునీత, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ సీనియర్ సైంటిస్ట్ క్లినికల్ స్ట్రాటజీ ఎక్స్పర్ట్ డాక్టర్ జగన్మోహన్ సోమగోని మాట్లాడారు. సదస్సు డైరెక్టర్ ఎ.ప్రమీలరాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ డి.రవిశంకర్రెడ్డి, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యు.అన్నపూర్ణ, డాక్టర్ కె.సుజనా, డాక్టర్ గాయత్రి రమ్య, కోశాధికారి కె.విజయ కిషోర్, డాక్టర్ పి.రవి పాల్గొన్నారు.