ప్రజాశక్తి-ఎఎన్యు : ప్రేమ వివాహం, ఆపై కొంత కాలానికి మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చిన ఓ ఆడపిల్ల కథే ‘నాన్న నేనొ చ్చేస్తా’ నాటకం. తల్లీకూతుర్లుగా అమృతవర్షిణి, లహరి ఆ పాత్రల్లో నటించలేదు.. జీవించారు.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ నాటక ప్రదర్శన ద్వారా సమాజానికి, నేటి యువత ఆలోచనల్లో వస్తున్న మార్పులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించే కళారంగ నాటక పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రదర్శన కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల అనుబంధం, పెళ్లికి ఉన్న సంబంధాలను బలోపేతం చేసే సందేశాన్నిస్తూ సాగింది. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని కళాత్మకను వెలికి తీసేందుకు, కళా రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో వర్సిటీలో థియేటర్ ఆర్ట్స్, సినిమా, టీవీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో రెక్టార్ పి.వరప్రసాద మూర్తి, రిజిస్ట్రార్ బి.కరుణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.స్వరూపరాణి, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇ.శ్రీనివాసరెడ్డి, థియేటర్ ఆర్ట్స్ విభాగం డీన్ డాక్టర్ జి.అనిత, విభాగం అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.మధుబాబు, సిడిసి డిన్ కె.మధుబాబు, అధ్యాపకులు డాక్టర్ జీవి భూషణ్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/IMG_8040.jpg)