కెపి ఉల్లి రైతుల్లో అయోమయం

ఉల్లి పేరు వినగానే మార్కెట్లో ఎవరి నోట విన్నా ఘాటు వినిపిస్తుంది. కెపి ఉల్లి (కృష్ణాపురం రకం) సాగు చేసిన రైతు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు మార్కెట్లో పర్వాలేదనుకుంటే పండించిన పంటను అమ్మకం చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ఎగుమతుల విషయంలో రైతుల కష్టాలను ముఖ్యమంత్రి గుర్తించి కేంద్రంతో మాట్లాడాల్సి ఉంది. ఆయన స్పందనపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. కెపి ఉల్లి సాగు, రైతుల పరిస్థితి, ప్రభుత్వ కొనుగోళ్లపై ప్రత్యేక కథనం.ప్రజాశక్తి – చాపాడు ఉల్లి ధరలు పెరిగిన సందర్భాలలో అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులు నిషేదం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో స్ధానికంగా విక్రయాలు లేని విదేశీ రకం కెపి ఉల్లి పండించే రైతుల్లో ఆందోళన మొదలైంది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు రెక్కలు వచ్చిన సందర్భంగా కేంద్రం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటు దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యత పెంచడం ఉల్లి ధరను నియంత్రించే లక్ష్యంగా ఈ నిషేధం విధిస్తున్నారు. డిజి ఎఫ్‌ టి డైరెక్టర్‌ జనరల్‌ (ట్రేడ్‌)నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రతి సారి రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఉల్లి ధరలు మళ్లీ మండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. దీంతో వీటి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతుల పై నిషేధం విధించింది. కెపిఉల్లి సాగు చేసిన రైతులు రూ. 10 సంపాదించుకోవచ్చు అని ఆశించడం సహజం. కానీ పండించిన పంటను అమ్ముకు నేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. సాగుకు రూ. 50 వేల నుంచి 60 వేల వరకు సాగు ఖర్చులు అవుతున్నాయని పేర్కొంటున్నారు. విత్తనాలు కిలో రూ. రూ. 1000 నుంచి రూ. 1500 వరకు వెచ్చించి కొనుగోలు చేసి ఎకరాకు 23 కేజీల చొప్పున వేశారు. నూర్పిడి చేసేందుకు రూ 10 వేలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. రాయలసీమకు విదేశీ మారక ద్రవ్యం తీసుకువచ్చే అతి పెద్ద పంట కెపి ఉల్లి. అలాంటి విదేశీ ఎగుమతిలను కేంద్ర ప్రభుత్వం నిషేధి ంచడంతో అమ్మకానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు స్థానికంగా అమ్మకం చేయాలంటే దళారులు నిర్ణయించినదే ధర. మైదుకూరు కేంద్రంగా జిల్లాలోని దువ్వూరు, బి.మఠం మండలాలతో పాటు కర్నూలు జిల్లాలో సాగయ్యే ఉల్లికి పలు రోగాలను నయం చేసే గుణం కలిగి ఆరోగ్యప్రదాయిని గాపేరుగాంచింది .రాయల సీమలోని కడప కర్నూలు జిల్లాలో సాగైన ఉల్లిపా యలకు ఈశాన్య ఆసియా దేశాలైన సింగపూర్‌, మలేషియా, దుబారు, హాంకాంగ్‌, శ్రీలంక దేశాలలో మంచి డిమాండ్‌ ఉండేది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధిం చింది. మనదేశంలో వినియోగించే ఉల్లిపాయలకు, ఎగుమతుల అవసరాలకు పండించే ఉల్లిపాయలకు వ్యత్యాసం ఉంది. కానీ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించకుండా అన్ని ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. జిల్లాలో మైదుకూరు, దువ్వూరు ఇతర ప్రాంతాలలో ఈ ఏడాది 5000 ఎకరాలలో ఉల్లి పంట సాగైంది. దాదాపుగా 15 వేల టన్నుల వరకు దిగుబడి వస్తుంది .రైతులు ఉల్లి పంటను ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ సాగు చేయడం ఆనవాయితీ. ప్రారంభంలో క్వింటా కెపి ఉల్లి ధర రూ. 11వేల తో ప్రారంభమై రూ. 8000 వరకు తగ్గాయి. సాగుకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఖర్చు అయ్యాయి. మార్కెట్‌ యార్డ్‌ ద్వారా విక్రయాలు రైతులకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ వారు కొనుగోలు చేసేందుకు విముఖ చూపుతున్నారు. గతంలో రైతులు సంఘంగా ఏర్పడి మార్క్‌ఫెడ్‌ ద్వారా కెపి ఉల్లి కొనుగోలు చేయాలని నిరసనలు కూడా చేపట్టారు. మనదేశంలో వినియోగించే ఉల్లిపాయలకు ఎగుమతుల అవసరాలకు పండించే కెపి ఉల్లిపాయలకు వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం స్పందించి కెపి ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తి వేయించి శాశ్వత కెపి ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. అమ్మకం కష్టంగా మారుతోంది.. ఉల్లి పంటను నూర్పిడిచేసిన తరువాత అమ్మకాలు చెపడదామంటే కొనుగోల ుదారులు ముందుకు రావడం లేదు. కెపి ఉల్లి పంటలో ఎన్నో ఏళ్లుగా సాగు చేపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించిన సందర్బంలో అమ్మకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మార్క్ఫెడ్‌ ద్వారా కెపి ఉల్లి కొనుగోలు చేయాలి. -రామసుబ్బారెడ్డి , రైతు, దువ్వూరు.శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి కెపి ఉల్లి మన ప్రాంతంలో మాత్రమే సాగు అయ్యే ప్రత్యేక రకానికి చెందింది. సాగుకు అధిక ఖర్చులు అవుతున్నాయి. అమ్మకం సమయంలో చాలా అవస్థలు పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వం శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే సాగుకు ఆసక్తి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలు పెరిగిన సమయంలో ఎగుమతికి పై నిషేధం విధిస్తుండడంతో ఆ ప్రభావం ఉల్లిపై పడుతుంది.-బి.పెద్ద పుల్లారెడ్డి, చల్లబసాయపల్లె, దువ్వూరు.

➡️