ప్రజాశక్తి – సాలూరు : పట్టణంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించి కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని టౌన్ సిఐ జిడి బాబు చెప్పారు. ఆదివారం దీనికి సంబంధించిన కరపత్రాలను ఆయన స్టేషన్ సిబ్బందితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎక్కడైనా సారా, గంజాయి రవాణా, నాటుసారా తయారీకి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. సారా, గంజాయి వినియోగానికి అలవాటు పడిన యువకులు మత్తులో ఏ పని చేస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో వుంటున్నారని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొని బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని సూచించారు. పోలీసు, ఆర్మీ రిక్రూట్మెంట్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులు తమను సంప్రదిస్తే తగిన సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దుపట్టణంలో ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు చించివేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని సిఐ బాబు చెప్పారు. ఎన్నికల ముందు ఇలాంటి చర్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం అందిస్తే తగిన బహుమతి అందజేయనున్నట్లు సిఐ బాబు చెప్పారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/police-3.jpg)