దీక్షల్లో ఉద్యోగులు
కొనసాగుతున్న దీక్షలు
ప్రజాశక్తి -నెల్లూరు
ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా, విధుల నుంచి తొలగించినా హామీలు అమలు చేసే వరకూ పోరాటం ఆగదని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వం చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు చేస్తున్న 24 రిలే దీక్షలు మంగళవారం నాటికి 4వ రోజుకు చేరాయి. ఈ దీక్షలల్లో వెంకటాచలం అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ ఉమా, టి.కామాక్షి, ఎం.శేషమ్మ, స్వర్ణలతలు ఇందుకూరుపేట ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలు ఎ.సుగుణమ్మ, ఎం.పద్మమ్మ, బి.రాధిక, డి.గీతాదేవి, సృజన, మస్తానమ్మలు కూర్చున్నారు. వీరికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.మోహన్రావు, సిఐటియు నాయకులు గోగుల శ్రీనివాసులు, అంగన్వాడీ యూనియన్ నాయకులు సుజాతమ్మ, ఎస్కె రెహనాబేగం పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. తొలుత 3వ రోజు 24 గంటల రిలే దీక్షలకు కూర్చున్న అర్బన్ ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలు కామాక్ష్మి, రజనీ, మల్లెమ్మ, శైలమ్మ, రూరల్ ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సంపూర్ణ, నాగ భూషణమ్మ, రత్నమ్మ, ఆయాలు నాగలక్ష్మి వెంకమ్మలు దీక్షలు విరమించారు. దీక్షలనుద్ధేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.మోహన్రావు మాట్లాడారు. ఎస్మా చట్టం ఏయే ప్రభుత్వ విభాగాలు వస్తాయో అంగన్వాడీలకు వివరించి అవగాహన కల్పించారు. రిలే దీక్షలకు ఎస్డబ్ల్యుఎఫ్ నాయకులు, లాయర్స్ అసోసియేషన్ న్యాయ వాదులు, ఆటో యూనియన్ నాయకులు, ఆవాజ్ సంఘం నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, ఎఐటియుసి నాయకులు, ఐఎఫ్టియు నాయకులు, పౌరహక్కుల సంఘం నాయకులు, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నాయకులు హాజరై తమ సంఘీభావం తెలిపారు.