ప్రజాశక్తి-యర్రగొండపాలెం: గిరిజనులకు పక్కా గృహాలు, ఆధార్ కార్డులు, జాబ్ కార్డులు, పింఛన్లు ఇలా 11 రకాల సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేయాలని మార్కాపురం డిఎల్డివో బివిఎన్ సాయికుమార్ తెలిపారు. గురువారం యర్రగొండపాలెంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో అర్ధవీడు, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, పుల్లలచెరువు, పెద్దారవీడు మండలాల ఎంపిడివోలు, హౌసింగ్ అధికారులు, ఐటిడిఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి గిరిజనుడికి పిఎం జన్మన్ కార్యక్రమం ద్వారా లబ్ధి జరగాలని చెప్పారు. సర్వేను సమర్ధవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇంకా లీడ్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం, నాబార్డు డీడీవో రవికుమార్, ఐటిడిఏ ఉద్యాన అధికారి ధనుంజరు, పశు సంవర్ధక శాఖ డీడీ వెంకట సుబ్బయ్య, ఐటిడిఏ అడిషనల్ పీడీ కెవి నాయక్ మాట్లాడారు. ఏడు మండలాల ఎంపిడివోలు, హౌసింగ్ అధికారులు, ఐటిడిఏ అధికారులు పాల్గొన్నారు.