ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
ఎస్ఎఫ్ఐ 54 వ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. స్ధానిక ఎస్టి బాలికల వసతి గృహాంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై.భాస్కర్ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.భాస్కర్, ఎన్. రాజా మాట్లాడుతూ 1970లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ నాటి నుంచి నేటి వరకూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తుందని అన్నారు. ఈ ఉద్యమాల్లో అనేక మంది విద్యార్థి సంఘ నేతలు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. అధ్యాయనం, పోరాటం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ముందుకు వెళ్తుందని, అలాగే అందరికి విద్య, ఉపాధి ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్తో ముందుకు సాగుతుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను కాషాయీకరణ, ప్రయివేటీకరణ చేస్తుందని అన్నారు. ఈ విధానాల వల్ల పేదలు విద్యకు దూరం అయ్యే పరిస్థితులు నెలకున్నాయని అన్నారు. నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి కె.జ్యోతి, కమిటీ సభ్యులు స్వేచ్ఛ, మువిల, దుర్గ, సురేష్, మరియ, తదితరులు పాల్గొన్నారు.