ప్రజాశక్తి – సాలూరు : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మి మోసపోవద్దని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర కోరారు. గురువారం సిఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 8తరగతి విద్యార్థినులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు సిఎంగా ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు. రైతులు, మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి నిలువునా మోసం చేసిన ఘనత బాబుదేనని అన్నారు. టిడిపి నాయకుల మాటలు నమ్మితే మళ్లీ మోసపోతారని చెప్పారు. జనసేన అధినేత పవన్కల్యాణ్కు రాజకీయ విలువల్లేవని విమర్శించారు. టిడిపి ప్రభుత్వం హయాంలో రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగిందని, పవన్కల్యాణ్ సాలూరు పర్యటన సందర్భంగా ధ్వజమెత్తారని గుర్తు చేశారు. లక్షల ఎకరాల భూములు దోపిడీ చేశారని టిడిపి నాయకులపై జనసేనాని దాడి చేశారని చెప్పారు. అలాంటి టిడిపితో ఇప్పుడు జనసేన అధినేత ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని ప్రశ్నించారు. గతంలో దోపిడీ టిడిపి ఇప్పుడు నీతివంతమైన పార్టీ ఎలా అయిందని నిలదీశారు. విద్యార్థులు ప్రాథమిక విద్యలో డిజిటల్ అక్కరాస్యత సాధించేందుకు ట్యాబ్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాంటి ప్రభుత్వాన్ని వద్దనుకుంటే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని రాజన్నదొర అన్నారు. కార్యక్రమంలో డిఇఒ ప్రేమ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, ఫ్లోర్లీడర్ గొర్లి జగన్మోహన్రావు వైస్ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు కౌన్సిలర్లు, కమిషనర్ టి.జయరాం, ఎంఇఒ రాజ్ కుమార్, మక్కువ మండల వైసిపి కన్వీనర్ మావుడి రంగునాయుడు, సాలూరు వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, ఎఎంసి చైర్మన్ దండి అనంతకుమారి, మండల వైసిపి కన్వీనర్ సువ్వాడ భరత్శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.ఘనంగా జగన్ పుట్టిన రోజు వేడుకలుసిఎం జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్లో రాజన్నదొర బర్త్డే కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర నివాసంలో ఆయన సతీమణి రోజమ్మ పేదలకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీల సమ్మెల ప్రస్తావిస్తూ వారి సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూల ధ్రుక్పథంతోనే ఉందన్నారు. రాష్ట్రఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంగన్వాడీ సంఘాలు ఆలోచించాలని కోరారు. వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.