జిల్లాలో రోజురోజుకూ అంగన్వాడీల నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తున్నారు. 17 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఎం జగన్మోహన్రెడ్డికి పోస్టుకార్డులు రాశారు. మరోవైపు అంగన్వాడీల సమ్మెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. సమ్మె శిబిరాలను టిడిపి, సిపిఎం, జనసేన నేతలు, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు సందర్శించి, సంఘీభావం ప్రకటించారు.
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె జిల్లాలో గురువారం 17వ రోజుకు చేరింది. యూనియన్ పార్వతీపురం ప్రాజెక్టు నాయకులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీమణి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. సమ్మె శిబిరం వద్ద ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాసి పంపించారు. వీరికి సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, డిమాండ్చేశారు. యాప్ల పేరుతో పని భారాన్ని రద్దు చేయాలన్నారు. అంగన్వాడీల డిమాండ్లు ఆమోదించే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలకు యుటిఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి మురళీమోహన్, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దావాల రమణారావు, యమ్మల మన్మథరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఎపి ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి జిల్లా కన్వీనర్ బి.వి.రమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు రాజేశ్వరి, ఎం.గౌరీ, బి.శాంతి, తదితరులు పాల్గొన్నారు.సాలూరు : పట్టణంలో అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యాన ప్రాజెక్టు పట్టణ నాయకులు బి.రాధ, ఎ.నారాయణమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు పోస్ట్ కార్డులను పోస్టాఫీసు వద్ద బాక్స్లో వేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్యామల, వరలక్ష్మి, తిరుపతమ్మ, పార్వతి, శశికళ పాల్గొన్నారు.సీతానగరం : తహశీల్దార్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.రామలక్ష్మి, సిఐటియు నాయకులు జి.వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆర్.ఈశ్వరరావు, వై.రామారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు రెడ్డి లక్ష్మి, వై.సత్యవతి, జి.సునీత పాల్గొన్నారు.సీతంపేట : ఐటిడిఎ ముఖద్వారం వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణారావు, మండల నాయకులు బిడ్డిక పకీరు, బిడ్డిక జయప్రకాశ్, ఎ.ప్రకాశం సందర్శించి, సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు కాంతారావు, సురేష్, అంగన్వాడీ సంఘం అధ్యక్ష, కార్యదర్శి పార్వతి, దర్శిమి, అంజలి తదితరులు పాల్గొన్నారు.పాచిపెంట : మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు సూకూరు అప్పలస్వామి, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు టి.ప్రభావతి, పైడిరాజు, బేగం, సత్యమంగ, నాగమణి పాల్గొన్నారు.కురుపాం : మండల కేంద్రంలో అంగన్వాడీలు పోస్ట్ కార్డులు రాసి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమారి, ప్రాజెక్టు కార్యదర్శి జె.సరోజ, తదితరులు పాల్గొన్నారు.మక్కువ : మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. వీరికి టిడిపి సీనియర్ నాయకులు మావుడి ప్రసాద్రావు నాయుడు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త గేదెల రిషవర్ధన్ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఇందిర, తదితరులు పాల్గొన్నారు.