- గ్రీవెన్స్లో డిఆర్ఓకి సీఐటీయూ వినతి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ముసిడిపల్లి రామతీర్థల్లు నెల్లిమర్ల మాస్టర్ పంప్ హౌస్ కార్మికులకు 3 నెలల బకాయి జీతాలు, పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలల బకాయి హెల్త్ అలవెన్సులు తక్షణమే చెల్లించాలనీ ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్లో డి ఆర్వో అనితకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా బాధ్యులు ఏ.జగన్ మోహన్ రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి.సుధారాణి, నాయకులు చందర్రావు, రాఘవ, అర్జున్, లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ విజయనగరం పట్టణ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందిస్తున్న నెల్లిమర్ల, రామతీర్థ్యాలు, ముసిడిపల్లి పంపు హౌస్ కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు, పారిశుధ్య కార్మికులకు 3 నెలల హెల్త్ అలవెన్సులు బకాయిలు ఉన్నాయని , జీతాలు, హెల్త్ అలవెన్సులు ప్రతినెలా చెల్లించకపోతే బ్రతకడం ఎలా అని ప్రశ్నించారు. దీపావళి, నాగుల చవితి పండగల్లో ఇబ్బంది పడ్డామని, వచ్చేవి క్రిస్మస్, సంక్రాంతి పండగ రోజులని జీతాలు చెల్లించకపోతే పస్తులు ఉండాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు, హెల్త్ అలవెన్సులు తక్షణమే చెల్లించకపోతే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు నీ కలిసి సమస్యను వివరించామని, కమిషనర్ స్పందించి డిఇ అప్పారావుతో మాట్లాడి జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.