ఫొటో : జిఒ ప్రతులను దగ్ధం చేస్తున్న అంగన్వాడీలు
డిమాండ్స్ నెరవేరే వరకూ ఆందోళన
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్స్ నెరవేరేవరకూ ఆందోళన విరమించేది లేదని సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున అన్నారు. ఆదివారం అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని నిరసిస్తూ స్థానిక బెజవాడ గోపాల్ రెడ్డి పార్కు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు జిఒ నెంబర్ 2 కాపీలను దగ్ధం చేసి తమ నిరసన తెలియజేశారు. అంగన్వాడీలు ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగులు కాదని వీళ్లకు ఎస్మా చట్టం వర్తించదన్నారు. గతంలో ఎస్మా చట్టాన్ని ఉపయోగించిన ప్రభుత్వాలు ప్రజల కోపాగ్నికి, వ్యతిరేకతకు గురై అధికారాన్ని, పదవిని కోల్పోయారని తెలియజేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలకు సిఐటియు ఎప్పుడు మద్దతిస్తుందని తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షురాలు ఎల్వి శేషమ్మ మాట్లాడుతూ ప్రభుత్వానికి తమన్యాయమైన కోరికలను నెరవేర్చాలన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా రకరకాల పద్ధతిలో మొరపెట్టుకుంటున్నామని, అయినా ఈ ప్రభుత్వం చీమకుట్టినట్టుగా లేకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు కవిత, సుమ కార్యకర్తలు, సిఐటియు నాయకులు షేక్ జానిభాషా పాల్గొన్నారు.
![ఫొటో : జిఒ ప్రతులను దగ్ధం చేస్తున్న అంగన్వాడీలు](https://prajasakti.com/wp-content/uploads/2024/01/kovur-1.jpeg)