ప్రజాశక్తి – పాచిపెంట : మండల కేంద్రమైన పాచిపెంటలో గల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయంలో గుర్తుతెలియని కొంతమంది దుండగులు సోమవారం అర్ధరాత్రి ఆలయంలో గల బృంగి, శృంగి, సోమనాథ్ లింగం, మహానంది విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం గ్రామస్తుడు బుగత ఆనంద్ చూసి ఆలయ కమిటీ సభ్యులకు విషయం తెలియజేశారు. ఈ మేరకు కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు సాలూరు సిఐ ధనుంజయరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయం వద్ద గస్తీ నిర్వహించాలని ఎఎస్ఐ బి.ముసలయ్యను ఆదేశించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. విషయం తెలుసుకొని అదే సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఎంపిపి బి.ప్రమీల సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం సిఐతో మాట్లాడి దుండగల దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.