ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకురాలు నాగమ్మ అవార్డులను 7వ తేదీన ప్రదానం చేస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. వ్యాపార, విద్య, కళలు, క్రీడా రంగాల్లో ప్రతిభ చాటిన జిల్లా మహిళలకు నాయకురాలు నాగమ్మ పేరుమీద అవార్డులు ఇస్తామన్నారు. వచ్చేనెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు మహిళా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ, సిడిపిఒలను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను ప్రత్యేక బృందం పరిశీలిస్తుందని, ఇందులో మహిళా-శిశు సంక్షేమ శాఖ, మహిళా అధికారిక శాఖ అధికారిని, పెద్దలు, మీడియా ప్రతినిధి ఉంటారని తెలిపారు. మొత్తం ఐదుగుర్ని ఎంపిక చేస్తామని మొదటి ఒకరికి నాయకురాలు నాగమ్మ అవార్డును బహూకరణతోపాటు రూ.10,116 నగదు బహుమతి, జ్ఞాపిక అందిస్తామని, మరో ఐదుగురికి ప్రశంసా పత్రాలతో సత్కరిస్తామని తెలిపారు. వివరాలకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ – మహిళా సాధికారిక ఆఫీసర్ను సంప్రదించాలని, 9491051745, 7799025664 ఫోన్ నంబర్లలోనూ సంప్రదించొచ్చని వివరించారు.