ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : నిర్మాణాత్మక ఆలోచనలకు నిలువుటద్దం దామోదరం సంజీవయ్యని డిఆర్ఒ జి.కేశవనాయుడు కొనియాడారు. మాజీ సిఎం దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవాలను బుధవారం కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంజీవయ్య చిత్రపటానికి డిఆర్ఒ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్ముడు చూపిన బాటలో సాగుతూ దామోదరం సంజీవయ్య దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. తెలుగును అధికారభాషగా ప్రకటించడానికి కృషి చేశారన్నారు. దేశభక్తి, సమతాదృష్టి, నిర్మాణాత్మక ఆలోచనలకు ఆనవాలయిన ఆయన జీవిత చరిత్ర మరింత వెలుగులోకి తీసుకుని రావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం.డి.గయాజుద్దీన్, బిసి వెల్ఫేర్ అధికారి ఎస్.కృష్ణ, కలెక్టరేట్ ఎఒ పి.రామారావు, సూపరింటెండెంట్లు వి.సుజాత, బి.చిన్నికృష్ణ, ఎ.శ్రీనివాసరావు, ఎ.సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.