ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రాష్ట్రంలో నూతన విద్యావిధానం తీసుకు వచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేసారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ విమర్శించారు. ఫెడరేషన్ జిల్లా మహాసభ స్థానిక విక్రం హాల్లో మంగళవారం నిర్వహించారు. దీనిలో ఆయన మాట్లాడారు. అనేక ప్రాథమిక పాఠశాలలను మూసివేయడం విద్యను పేదవారికి అందకుండా చేయడమేనని చెప్పారు. పేద విద్యార్థులకు విద్యనందించాలి అంటే పాఠశాలలు ఇంకా కొత్తవి పెట్టాలి గానీ ఉన్నవి మూసేయ్యడం పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడమేనన్నారు. జిఒ నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న అమ్మవడి, వసతీ దీవెన వెంటనే విడుదల చేయాలని, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫుల్ టైమ్ ఫీజ్ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కందుకూరి విద్యాసంస్థలను ప్రభుత్వ పరం చేయడం కోసం ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం చేసిన కృషి ఎంతో అభినందనీయమైందన్నారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా వై.భాస్కర్, కార్యదర్శిగా ఎన్.రాజాను, సహాయక కార్యదర్శిగా ఎం.జోసెఫ్ ఉపాధ్యక్షునిగా వి.రాంబాబు, కె.జ్యోతి జిల్లా కమిటీ సభ్యులుగా మువిల, మరియా, మహేష్, సురేష్, కనక, క్రాంతి, దుర్గ, వాసు ఎన్నికయ్యారు.