ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి, జనసేన పార్టీల ఆధ్వర్యాన నష్టపోయిన పంట చేలను పలు ప్రాంతాల్లో బుధవారరం పరిశీలించారు. పెరవలి మండలంలోని ముక్కామలలో బుధవారం తెలుగుదేశం పార్టీ బృందం మాజీ ఎంఎల్ఎ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ బృందంలో మాజీ ఎంఎల్సి ఆదిరెడ్డి అప్పారావు, నిడదవోలు నియోజకవర్గ అబ్జర్వర్ కటకంశెట్టి ప్రభాకర్, కొవ్వూరు నియోజకవర్గ అబ్జర్వర్ గొర్రెల శ్రీధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ దెబ్బతిన్న వరి, అరటి, చెరకు, కూరగాయల పంటలను, తడిసిన ధాన్యం, పూల తోటలను పరిశీలించారు. సుమారు 2900 ఎకరాల్లో వివిధరకాల పంటల నష్టం రూ.20 కోట్ల మేర ఉంటుందన్నారు. రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులిదిండి నాగరాజు, అతికాల రామకృష్ణమ్మ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.తాళ్లపూడి మండలంలోని రాగోలపల్లి, తుపాకులగూడెం, పోచవరం తదితర గ్రామాల్లో నీట మునిగిన పొగాకు వరి తదితర పంటలను టిడిపి నాయకులు పరిశీలించారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ నష్టాలను పరిశీలించి తక్షణ సాయం అందించవలసిన ప్రభుత్వం రైతు కష్టాన్ని పట్టించుకోవడంలేదని జగన్ ప్రభుత్వానికి ఇవే చివరి రోజులని అన్నారు. చేతికొచ్చిన పంట నోటి దకా రాలేని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందని రైతులను అన్ని విధాల ఆదుకునేది టిడిపి మాత్రమేనన్నారు. వారి వెంట మండల టిడిపి శాఖ అధ్యక్షుడర నామన పరమేశ్వరరావు, జొన్నలగడ్డ సుబ్బారాయుడు, కంఠమని రామకృష్ణ ప్రభాకర్, గొర్రెల శ్రీధర్, కొటారు వెంకట్రావు, కాకర్ల సత్యేంద్ర చలపతి, ప్రకాష్, అన్నమరెడ్డి సత్తిబాబు తదితరులు ఉన్నారు.కొవ్వూరు రూరల్ కొవ్వూరు నియోజకవర్గంలో పంటనష్టాలను టిడిపి ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమని రామకృష్ణారావుతో కలసి ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నిడదవోలు నియోజకవర్గ అబ్జర్వర్ కటకంశెట్టి ప్రబాకర్, కొవ్వూరు నియోజకవర్గ అబ్జర్వర్ గొర్రెల శ్రీధర్ తదితరులు దెబ్బతిన్న, అరటి, పుగాకు పంటలను పరిశీలించారు. టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.