ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని బ్రిటిష్ కాలంలో నిర్మించబడి శిథిలావస్థకు చేరిన కనిగిరి పాత తహశీల్దారు కార్యాలయాన్ని గురువారం కనిగిరి ఆర్డీవో జాన్ ఇర్విన్తో కలిసి కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ఈ భవనం నుంచి నిత్యం సేవలు అందించేందుకు సౌకర్యవంతంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పాత తహశీల్దారు కార్యాలయానికి నూతనంగా పైకప్పు నిర్మిస్తే విధులను నిర్వహించుకోవచ్చని అన్నారు. మరమ్మతులు చేయిస్తే ఇతర ప్రభుత్వ అవసరాలకు కూడా వాడుకోవచ్చని ఆర్డిఓ జాన్ ఇర్విన్ను కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. పాత తహశీల్దారు కార్యాలయాన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ రమణారెడ్డి, ఆర్ఐ రమేష్, మున్సిపల్ శానిటరీ ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.