ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్ క్లెయిమ్స్ను వెంటనే పూర్తి చేయాలని ఆర్డిఒ విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆర్డిఒ కార్యాలయంలో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఒ మాట్లాడుతూ ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 11,708 పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నాయన్నారు. అందులో ఫారం-6 క్లెయిమ్స్ 3,137, ఫారం-7 క్లెయిమ్స్ 4,354, ఫారం-8 క్లెయిమ్స్ 4,203, ఫారం 6ఏ క్లెయిమ్స్ 14 ఉన్నాయని వాటిని వెంటనే బిఎల్ఒలు, సూపర్ వైజర్లు పూర్తి చేయాలని కోరారు. ఓటర్ల జాబితా 2024 జనవరి 5 న విడుదల చేస్తామని తెలిపారు. నియోజకవర్గం లోని 259 పోలింగ్ స్టేషన్ లలో అర్హత ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఫారం 6 ద్వారా కొత్త ఓట్లు చేర్చుకోవటానికి, ఫారం 7లో డబుల్ ఓట్లు తొలిగించటం, ఫారం 8లో ఓట్లు ఒక చోటు నుంచి మరొక చోటుకు మార్చటానికి, ఫారం 6ఏలో ఆధార్ అనుసంధానం చేసుకోవటానికి ఎన్నికల సంఘం ఈనెల 9 వరకూ అవకాశం కల్పించిందన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23 లోపు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తహశీల్దారు పి.మురళి, వైసిపి రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, టిడిపి ప్రతినిధి కటారి సంజరు, స్వరూప్, బిజెపి ప్రతినిధులు బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం ,కాంగ్రెస్ ప్రతినిధి ఎస్కె.రసూల్. సిపిఎం నాయకులు రమేష్ సూపవైజర్లు, బిఎల్ఒలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/ong-rdo.jpg)