ఫొటో : మాట్లాడుతున్న ఎంపిపి కేత వేణుగోపాల్రెడ్డి
పేదల ఆరోగ్యం కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం మంగళవారం ఆత్మకూరు మండలంలోని చర్లోఎడవల్లి సచివాలయ పరిధిలో నిర్వహించారు. ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సచివాలయ పరిధిలో హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం, ఎఎన్ఎంలను నియమించడం, 104 సేవలను విస్తరింపజేయడం మాత్రమే కాకుండా ఆరోగ్య సురక్ష ద్వారా ప్రత్యేక వైద్య బృందాన్ని గ్రామాలకు రప్పించి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని గురించి సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మెడికల్ సిబ్బంది ముందుగా అందరికీ తెలియజేసి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కౌంటరు ఏర్పాటు చేసి నమోదు చేసుకున్న పేషెంట్లకు ముందుగానే బిపి, సుగర్, రక్తపరీక్షలు నిర్వహించి స్పెషలిస్ట్ డాక్టర్ల వద్దకు పంపించి వారు పరీక్షించిన తర్వాత మందులు ఇప్పించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్స్, ఇతర హాస్పిటల్స్కు రెఫర్ చేస్తామని తెలిపారు. డాక్టర్ అనూష కుమారి, డాక్టర్ అరవింద్, డాక్టర్.షేక్ రేష్మ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ ఎం.కోటేశ్వరరావులు పేషెంట్లను పరీక్షించి వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో ఇఒపిఆర్డి, నాగులపాడు, చెర్ల ఎడవల్లి సర్పంచులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.
![ఫొటో : మాట్లాడుతున్న ఎంపిపి కేత వేణుగోపాల్రెడ్డి](https://prajasakti.com/wp-content/uploads/2024/01/atk-1-scaled.jpg)