ప్రజాశక్తి-కొండపి : రైతులు పొగాకు అక్రమంగా విక్రయించినా, ఎవరైనా కొనుగోలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు సెక్రటరీ అండ్ ఆక్షన్ మేనేజర్ దివి వ్రేణుగోపాల్ హెచ్చరించారు. కొండపి పొగాకు బోర్డు పరిధిలోని నేతివారిపాలెం, పైడిపాడు గ్రామాలలో పొగాకు తోటలను, క్యూరింగ్ చేసిన పొగాకును గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు తగు సూచనలు , సలహాలు చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ రైతులు తాము పండించిన పొగాకుకు బోర్డులోనే అమ్మకాలు జరపాలన్నారు.కోల్డ్ స్టోరేజీలో పొగాకు బేళ్లను నిల్వ ఉంచడానికి బోర్డులో తగిన పత్రాలు తీసుకోవాలన్నారు. పొగాకు గ్రేడిండ్ సమయంలో అన్యపదార్థాలు లేకుండా చూసుకోవాలన్నారు. క్యూరింగ్ , గ్రేడింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు తెలిపారు. తొలుత పొగాకు బోర్డు ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రాంతీయ అధికారి ఎం.లక్ష్మణ్, వేలం నిర్వహణాధికారి జి.సునీల్కుమార్, బోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/08kdp2.jpg)