ప్రజాశక్తి-కాకినాడ రూరల్తుపాను వల్ల నష్టపోయిన రైతులను, ముఖ్యంగా కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తక్షణం ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. చీడిగ, తూరంగి బైపాస్ రోడ్డులోని దెబ్బ తిన్న పంట పొలాలను పార్టీ బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పంట నష్ట పరిహారం ఎకరాకు రూ.35 వేలు ఇవ్వాలని, తేమ శాతం నిబంధనల పట్ల రైతులకు అవగాహన, భరోసా కల్పించాలని. ముంపు సమస్యలకు కారణమవుతున్న ఆక్రమణలు తొలగించాలని పార్టీ డిమాండ్ చేసింది. తుపాను వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరాకూ రూ.35 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. నూటికి 90 శాతం పైబడి కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని, వడ్డీ వ్యాపారులు, ఎరువుల కొట్ల వ్యాపారుల వద్ద అప్పులు చేసి ఒక్కో ఎకరాకూ రూ.35 వేలు పెట్టుబడి పెట్టారన్నారు. బైపాస్ రోడ్డు, కొవ్వూరు రోడ్డు, మేడలైన్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఆక్రమణల వల్ల పంట కాలువలు, డ్రైనేజీలు మూసుకుపోవడం వల్ల నీరు దిగడం లేదని, పనలపై ఉన్న పంట కుళ్లిపోయేలా ఉందని సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ తెలిపారు. 9 ఎకరాల్లో పంట సాగుచేసిన కౌలు రైతు రూ.3 లక్షలు పెట్టుబడి అప్పులు చేసి పెట్టారని, మరో రైతు 6 ఎకరాలు సాగుకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. జిల్లాలో ఎక్కడ చూసినా పంట బయటకు తేవడానికి వీలు లేకుండా చుట్టూ నీటి ముంపు ఉందని క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన చేసి వేసవి కాలంలోనయినా తగిన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంట పొలాలను పరిశీలించిన పార్టీ బృందంలో కె.శ్రీనివాస్, పి.రామకష్ణ, టి.రాజా, ఎంవి.రమణ, వి.చంద్రరావు ఉన్నారు.