ప్రజాశక్తి – నెల్లిమర్ల : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. సోమవారం సతివాడలో ధాన్యం కొనుగోలు కేంద్రం, డి పట్టా భూములకు శాశ్వత భూ హక్కు పత్రాలు పంపిణీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పి. సురేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్న డి పట్టా భూములకు శాశ్వత భూహక్కులు కల్పించి పత్రాలు ఇస్తున్నామన్నారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నియోజక వర్గ స్థాయిలో 258 మంది వికలాంగులకు అనుకరణ పరికరాలు, ట్రై సైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ళ సుధారాణి, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు అంబళ్ల శ్రీ రాములు నాయుడు, నగర పంచాయతీ చైర్మన్ బంగారు సరోజినీ, డిసిసిబి వైస్ ఛైర్మన్ చనమల్ల వెంకట రమణ, జడ్పిటిసి గదల సన్యాసినాయుడు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరషన్ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు, సర్పంచ్ రేవల్ల శ్రీనివాసరావు, ఎంపిటిసి రెడ్డి సత్య నారాయణ, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ జమ్ము అప్పల నాయుడు, తహశీల్దార్ డి. ధర్మ రాజు, ఎంపిడిఒ జి.రామారావు తదితరులు పాల్గొన్నారు. నాయకులు లేకుండానే ‘వై నీడ్ జగన్’నగర పంచాయతీలో ఎపికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు, జెసిఎస్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, ఇతర నాయకులు లేకుండానే నిర్వహించారు. సోమవారం నగర పంచాయతీ 3 వార్డు సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చైర్మన్, వైస్ ఛైర్మన్, అధికార్లు తప్ప పార్టీ అధ్యక్షులు, జె సిఎస్ కన్వీనర్లు, కౌన్సిలర్లు సైతం హాజరు కాకుండా జెండా ఆవిష్కరణ జరిపి మమ అనిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ మీద, అధికార్ల తీరు మీద గుర్రుగా ఉన్న నేతలు వై నీడ్ ఎపి జగన్ కార్యక్రమానికి చెప్పక పోవడం మరింత ఆగ్రహంతో రగిలి పోతున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ మీద అన్ని వర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా వై నీడ్ ఎపి జగన్ కార్యక్రమానికి సమాచారం ఇవ్వక పోవడం పార్టీ అధ్యక్షులు, జెసిఎస్ కన్వీనర్లు, కౌన్సిలర్లు మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/NML-MLA.jpg)