ప్రజాశక్తి-టంగుటూరు : ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో ఉద్యోగ, కార్మిక, నిరుపేదలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. స్థానిక కొండపి రోడ్డులోని యుటిఎఫ్ కార్యాలయంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు పేదలపై భారాలు అనే అంశంపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లను పెంచి పోషిస్తూ పేదలను ఇంకా నిరుపేదలుగా మార్చే విధానాలను ప్రవేశపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోషలిజం కోసం రష్యాలో లెనిన్ తన జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు. తొలుత సిపిఎం జిల్లా మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య, సిపిఎం జిల్లా ప్రథమ కార్యదర్శి పమిడి కోటయ్య చిత్రపటాలకు సిఐటియు నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జివి. కొండారెడ్డి, టంగుటూరి రాము, సిఐటియు నాయకులు వేశపోగు మోజెస్, జి వందనం, కె.విజయ, జి.అంకయ్య, పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/1.Tanguturu.jpg)