ప్రజాశక్తి- మెంటాడ : టిడిపి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలోనే రాష్ట్రానికి దశ దిశని ప్రజలు గ్రహించారని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. త్వరలోనే టిడిపి, జనసేన ప్రభుత్వ ఏర్పాటుతో వైసిపి విధ్వంసానికి, ఆరాచకానికి ముగింపు తధ్యమన్నారు. శనివారం మండలంలోని జక్కువ గ్రామంలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ ఏలుబడిలో రాష్ట్రం చిన్నాభిన్నం అయిందని ధ్వజమెత్తారు. అన్నివర్గాల ప్రజలు జగన్ బాధితులేనని చెప్పారు.. ఇంత సైకో సిఎంను ఇప్పటివరకూ ఎవరూ చూడలేదని దుయ్యబట్టారు. బటన్స్ నొక్కుతూ అదే అభివృద్ధి అని చెప్పుకుంటున్న జగన్ రెడ్డికి పాలన తెలీదని ఎద్దేవాచేశారు. రాష్ట్రాన్ని వైసిపి నేతలు లూటీ చేశారని దుమ్మెత్తిపోశారు. టిడిపి- జనసేన ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఆమె ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు చలుమూరి వెంకటరావు, జి.అన్నవరం, ముసలి నాయుడు, రెడ్డి ఎర్నాయుడు, రెడ్డి ఆదినారాయణ, ఎ.సత్యం, రామలింగేశ్వరరావు, తాడ్డి గోవింద్, గుమ్మిడి సింహాచలం, రెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.