ఫొటో : మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్రెడ్డి
బైక్ ర్యాలీ
ప్రజాశక్తి-జలదంకి : జలదంకి మండలంలోని అతి చిన్న గ్రామమైన బి కె అగ్రహారం గ్రామ ప్రజలు తామంతా జగనన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి వెంటే నంటూ మేకపాటి రాజగోపాల రెడ్డికి ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటుతూ బ్రహ్మరథం పట్టారు. ఆదివారం బి కె అగ్రహారం యువనేత దేవరపల్లి రఘురామిరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో బ్రాహ్మణక్రాక పంచాయతీ పరిధిలోని హనుమకొండ పాలెం సెంటర్ నుంచి బి కె అగ్రహారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనుమకొండ పాలెం రోడ్డులో వెలసి ఉన్న అభయ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బి.కె.అగ్రహారంలో ఏర్పాటు చేసిన వైసిపి ఆత్మీయ సమావేశంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే కుల, మత, పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటేనే తనకు ఓటు వేయండి అని అడిగిన ముఖ్యమంత్రి దేశంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని, అలాంటి ముఖ్యమంత్రికి ప్రతిఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని అలాగే ఎంపిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు జగనన్నతో పాటు మేకపాటి కుటుంబాన్ని కూడా ఆదరిస్తున్నారని, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉదయగిరికి వైసిపి అభ్యర్థిగా పోటీలో నిలిచానని తెలిపారు. ఎప్పటిలాగే ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసిపి మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి మాట్లాడుతూ సోమశిల జలాలు ఐఎబి సమావేశం తర్వాత జలదంకి మండల రైతందానికి అందించి జలదంకి మండల రైతాంగానికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎంతో మేలు చేశారని, జలదంకి మండలం రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాజగోపాల్ రెడ్డికి రైతన్నలంతా ఓటు వేసి ఆయన రుణాన్ని తీర్చుకుందాం అంటూ మండల రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గీతానంద రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం జగనన్నతోనే సాధ్యమని ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి మేకపాటి రాజగోపాల్ రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మేకపాటి కుటుంబం రూ.250 కోట్ల విలువైన ఇంజనీర్ కాలేజీని వ్యవసాయ యూనివర్సిటీ కోసం ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. అలాంటి కుటుంబానికి మేకపాటి రాజన్నను గెలిపించుకుంటే ఉదయగిరి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో దేవరపల్లి రఘురామిరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్క మదన్మోహన్ రెడ్డి, జలదంకి మండల సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ, సోమవరపాడు మాజీ సర్పంచ్ చేవూరు శ్రీనివాసులరెడ్డి, నాయకులు గంగపట్ల మాలకొండయ్య, మండల ఎస్సిసెల్ అధ్యక్షులు ఒంగోలు రాఘవేంద్ర, సురేష్, శేషారెడ్డి, బండారు సురేష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, యానాదిరెడ్డి, ఒక అయ్యప్ప రెడ్డి, దేవరపల్లి శ్రీనివాసులు రెడ్డి, వంగవరపు సురేష్ రెడ్డి, మాధవరెడ్డి, నల్లమలపు కృష్ణారెడ్డి, పులిమి రవీంద్రారెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, మండలంలోని నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
![ఫొటో : మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్రెడ్డి](https://prajasakti.com/wp-content/uploads/2024/03/jala.jpeg)