ప్రజాశక్తి – తుళ్లూరు : మహిళల అభ్యున్నతి, సాధికారితే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక మేరిమాత హైస్కూల్ అవరణలో జరిగిన వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే ఎం.సుచరిత పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా జిల్లాలో 2,86,000 మంది మహిళలకు రూ.987 కోట్లు లబ్ధి చేకూరందని చెప్పారు. ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ తుళ్లూరు మండలంలో 1063 డ్వాక్ర సంఘాల్లోని 10,587 మంది సభ్యులకు వైఎస్సార్ ఆసరా నాలుగో విడతలో రూ.10.16 కోట్లు జమ చేస్తున్నారన్నారు. ఈ మేరకు మెగా చెక్కును అందించారు.
ఆలస్యంపై మహిళలు ఆగ్రహం
కలెక్టర్, ఎమ్మెల్యే ప్రసంగాలు ముగియగానే మహిళలు సభ నుంచి ఇంటి దారిపట్టారు. ఎపిఎం చిన వీరయ్య ‘దయచేసి ఎవరూ వెళ్ళకండి.. ఆసరా చెక్కుల పంపిణీ ఉంది’ అని పదేపదే చెప్పినా మహిళలు వినిపించుకోలేదు. సభ కోసమని మధ్యాహ్నం 2 గంటలకు తీసుకొచ్చారు.. 5 గంటలకు పెట్టారు.. బయటికి వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు.. అని పలువురు మండిపడ్డారు.