ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ లక్ష్యమని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో నాల్గవ విడత వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. 2970 మహిళా సంఘాలకు రూ. 5 కోట్ల 57 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కె.దీనమయ్య, జడ్పిటిసి రాధిక, వైస్ ఎంపిపి నిమ్మక శేఖర్, బిసి రజక కార్పొరేషన్ డైరెక్టర్ జి.గిరిబాబు, పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్ : మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే ప్రభుత్వం చేయూత నిధులు అందజేస్తుందని, వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని వెంకంపేటలో శనివారం జరిగిన చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 5562 మంది స్వయం సహాయక మహిళలకు రూ.10 కోట్ల 46 లక్షలకు సంబంధించిన చెక్కులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా మేలు కలిగేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కావున రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ భాగ్యలక్ష్మి, ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్పిటిసి బలగ రేవతమ్మ, స్థానిక సర్పంచి తీళ్ల కృష్ణారావు, వైస్ ఎంపిపిలు సిద్ధ జగన్నాధరావు, బంకురు రవికుమార్, నాయకులు బొమ్మి రమేష్, ఎండ్రాపు తిరుపతి, గురురాజు, మడక విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.