ప్రజాశక్తి- అనకాపల్లి
అనకాపల్లి జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం కలక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ ఆఫ్ నార్కో కోఆర్డినేషన్ సెంటర్” సమావేశానికి జిల్లాలోని పోలీస్, సెబ్, ఆర్.టి.సి, రైల్వే, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, కోస్ట్ గార్డ్, మెరైన్, జీఆర్పీ, మత్స్య శాఖ తదితర శాఖల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా సంబంధిత శాఖల సమన్వయంతో డబ్బు, మద్యం, ఉచిత కానుకలు, మాదక ద్రవ్యాలు కట్టడికి ఎన్ఫోర్స్మెంట్ చేయాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మాదక ద్రవ్యాల నివారణకు పోలీసు శాఖతో కలిసి కృషి చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా మార్గాలు గుర్తించి అక్కడ 11 డైనమిక్ చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టి ఆర్.ఎస్.వి.ప్రసాద్, జాయింట్ డైరక్టర్ సెబ్ బి.విజయభాస్కర్, నర్సీపట్నం అదనపు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, కోస్ట్ గార్డు కమాండెంట్ గోవింద్ సరోన్, డి.ఆర్.ఓ దయానిధి, ఆర్డీవో నర్సీపట్నం హెచ్వి. జయరాం, డి.ఎం అండ్ హెచ్.ఓ డాక్టర్ హేమంత్, వ్యవసాయ శాఖ జెడి మోహన్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి అజరు బాబు, అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ వి.సుబ్బరాజు, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణ మూర్తి, నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రమణయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.