ప్రజాశక్తి – రాజానగరం
నేటి ఆధునిక సమాజంలో మానవునికి ఆరోగ్యకరమైన ఆహారం మిల్లెట్స్ ద్వారానే సాధ్యమని పలువురు అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ – 2023 సందర్భంగా గోదావరి రిజినల్ క్లస్టర్ గ్రూప్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్సర్ యూనివర్సిటీ సహకారంతో నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో శనివారం ‘మిల్లెట్స్ ఫర్ హెల్త్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్’ వర్క్ షాప్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా నన్నయ యూనివర్సిటీ విసి ఆచార్య కె.పద్మరాజు, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్సర్ యూనివర్సిటీ డాక్టర్ తోలేటి జానకిరామ్, జెఎన్టియుకె విసి ఆచార్య జివిఆర్.ప్రసాదరాజు, ఆయా యూనివర్శిటీల రిజిష్ట్రార్లు ఆచార్య జి.సుధాకర్, డాక్టర్ బి.శ్రీనివాసులు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.పి.విజయనిర్మల మాట్లాడారు. భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు కారణంగా ప్రపంచానికి మనదేశం ఆహారాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు. మిల్లెట్స్ ఒకప్పుడు పేదవాడి ఆహారంగా ఉండేదని, నేటి ఆధునిక కాలంలో అందరికీ అవసరమైన ఆరోగ్యకరమైన ఆహారంగా మారిందన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మిల్లెట్స్ను ఉత్పత్తి చేసే దేశమని వివరించారు. మానవ ఆరోగ్యానికి మిల్లెట్స్ ఎంతో దోహదపడతాయని, ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఎంతో అవసరమని చెప్పారు. రాష్ట్రంలో గోదావరి రీజనల్ క్లస్టర్ గ్రూప్ చాలా స్ట్రాంగ్గా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఐఐఎంఆర్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సి.తార సత్యవతి ఆన్లైన్ ద్వారా మిలెట్స్ యొక్క ప్రాధాన్యతను, ఆరోగ్యపరమైన ఆహారపు అలవాట్లను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణశ్రీ, డాక్టర్ పద్మావతి, ఆచార్య మోహనరావు, డాక్టర్ వల్లి, డాక్టర్ సలోమి సునీత, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.