ఫొటో : మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్న కౌన్సిలర్ సూరా భాస్కర్రెడ్డి
మున్సిపల్ నిధులు సొంతానికి వాడారు..
– కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎదుట ఆందోళన, ర్యాలీ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : మున్సిపాలిటీ నిధులను సొంతానికి వాడుకున్నారని, ఆ అవినీతి బయట పెట్టేందుకు సమాచార చట్టం కింద వివరాలు అడిగితే మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని 20వ వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరుపాలెంలో నిర్మించిన దివంగత మంత్రి గౌతమ్రెడ్డి విగ్రహానికి మున్సిపల్ నిధులు ఖర్చు చేశారని ఆరోపించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ నిర్మాణం రూ.4 కోట్లు పెట్టి కట్టామని ఎంఎల్ఎ చెప్పుకుంటున్నారని తెలిపారు. మున్సిపాలిటీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టారని అడిగితే తనకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఎంఎల్ఎ చేపట్టిన పలుసొంత నిధులలో మున్సిపాలిటీ నిధులు ఖర్చు చేశారని ఆరోపించారు. ఆత్మకూరు పట్టణంలో రోడ్లు ఆక్రమించి కట్టుకుంటున్నా ఎంఎల్ఎ పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ అధికారులు సమాచార చట్టానికి వివరణ ఇవ్వకపోతే నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఉద్యమిస్తామన్నారు.