అదానీ గంగవరం పోర్టు కార్మికుల నిరసన
ప్రజాశక్తి -గాజువాక : అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికునికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించడంలో ఆదానీ గంగవరం పోర్ట్ యాజమాన్యం నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ శుక్రవారం కార్మికులు నిరసన చేపట్టారు. ఇటీవల 44రోజులు సమ్మె చేసిన సమయంలో కుదిరిన ఒప్పందం మేరకు వేతనాలు చెల్లింపు, కార్మికులకు ఆరోగ్యకార్డులను అందజేసి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు చేపడతామన్న హామీలు అమలు కాకపోవడంపై మండిపడ్డారు. గరికిన నూకరాజు అనే కార్మికుడు వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ఇఎస్ఐ హాస్పిటల్లో చేరగా, మెరుగైన వైద్యం కోసం కెజిహెచ్కు రిఫర్ చేశారని, యాజమాన్యంతో కుదిరిన ఒప్పందం అమలైతే అతనికి కార్పొరేట్ వైద్యం అందేదని అంటున్నారు. దీనికి యాజమాన్యం నిరాకరించడంతో శుక్రవారం మధ్యాహ్నం పోర్టు గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గంగవరం పోర్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు మాట్లాడుతూ నిరసన సందర్భంగా పోర్టు యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుడు నూకరాజుకు ఏదైనా జరిగితే దానికి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వాసుపిల్లి ఎల్లయ్య పేర్ల నూకరాజు గంటి పిల్లి అమ్మోరు అప్పలరాజు అప్పారావు పాల్గొన్నారు. .
పోర్టు గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్న కార్మికులు