ప్రజాశక్తి – భీమడోలు
మండలంలో రబీ సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వ్యవసాయ అధికారి ఉషారాణి తెలిపారు. ప్రస్తుత సీజన్లో 13 వేల 150 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు జరుగుతుందని ప్రతిపాదించామన్నారు. ఈమేరకు 747 ఎకరాల విస్తీర్ణంలో నారుమళ్లను వేయాల్సి ఉండగా, ఇంతవరకు 377 ఎకరాల విస్తీర్ణంలో నారుమళ్లను వేసే కార్యక్రమం పూరైందని తెలిపారు. గత సీజన్లో పిఎల్ 1100, ఎంటియు 1318 రకాలను సాగు చేసి రైతులు ఆశించిన మేరకు దిగుబడులను సాధించారని తెలిపారు. ప్రస్తుత సీజన్లో పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఎంటియు 1121, పిఆర్ 126 రకాలను సాగు చేస్తున్నారన్నారు. ఈ రకాల సాగుపై రైతులు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం సాగు సందర్భంగా వ్యతిరేక ప్రభావాలు చూపించే అంశాలను తట్టుకొనే అవకాశాలు ఎక్కువగా ఉండటమేనని వ్యవసాయ అధికారి తెలిపారు.