రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పథకాలు అమలు

Dec 9,2023 20:18

  ప్రజాశక్తి-వేపాడ  :  ప్రజల అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనికేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. దేశ ప్రజలందరి సహకారంతో భారత్‌ను 2047 నాటికి అభివద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోడి పనిచేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు వాటిని అర్హులైన వారికి నూరుశాతం అందించే లక్ష్యంతో చేపట్టిన వికసిత్‌ భారత సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తిలో శనివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రైల్వేమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు ద్వారా రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని తమ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఈ సందర్భంగా పిఎం ఉజ్వల యోజన గ్యాస్‌ పథకం ఎంతమంది అందుకున్నారని కార్యక్రమానికి హాజరైన మహిళలను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సందర్శించారు. నిక్షరు మిత్ర కింద టిబి రోగులకు పౌష్టికాహారాన్ని, పిఎం ఉజ్వల యోజన కింద పలువురు లబ్దిదారులకు గ్యాస్‌ కనెక్షన్లు అందజేశారు. పి.బి.సురక్ష బీమాయోజన, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ స్కీమ్‌ పథకాల కింద లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో భూఆరోగ్య కార్డులు అందజేశారు. స్టాల్‌ను సందర్శించిన కేంద్ర మంత్రికి సెంట్రల్‌ బ్యూర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ అధికారి బి.తారకప్రసాద్‌ కేంద్ర పథకాల ప్రచార సామాగ్రి గురించి వివరించారు. ఎస్‌.కోట నియోజకవర్గానికి రైల్వేమంత్రి వరాలుకొత్తవలస రైల్వేస్టేషన్‌ ను ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి ప్రకటించారు. కె.కె.లైన్‌ను డబుల్‌ లైన్‌గా మార్పు చేస్తున్నట్టు చెప్పారు. దీనివల్ల ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పెరిగి అభివృద్ధి చెందేందుకు మరింత అవకాశం ఏర్పడుతుందన్నారు. విశాఖ-కిరండోల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఎస్‌.కోట రైల్వే స్టేషనులో నిలిపేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధులను గణనీయంగా పెంచామని కేంద్ర రైల్వే మంత్రి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే రాష్ట్రంలో రైల్వేల ప్రాజెక్టుల కోసం రూ.800 బడ్జెట్‌ కేటాయించగా, విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో రూ.8వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాలునాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తోందన్నారు. కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో నవంబరు 25నుంచి వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 156 గ్రామాల్లో ఈ యాత్ర పూర్తయ్యిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేయడంతోపాటు అర్హులందరికీ శతశాతం అందించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా జీవన ప్రమాణాలు పెంచేందుకు గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయని ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెప్పారు.కార్యక్రమంలో జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు జివిఎల్‌ నరసింహారావు, తూర్పుకోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌, విశాఖ రైల్వే డిఆర్‌ఎం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️