ప్రజాశక్తి – కాకినాడ
జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపట్టిన మూడవ దశ రీసెర్వే పనులు వేఘవంతం చేసి డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తిచేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జెసి ఇలక్కియాతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ భూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా సమగ్ర భూ సర్వే పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మూడో దశ రీసర్వే కింద 16 మండలాల్లో 90 గ్రామాల్లో చేపట్టడం జరిగిందన్నారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో తేమ శాతంలో రైతులకు ఇబ్బందులు పడకుండా ధ్యానం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన, రైస్ మిల్లర్లను పర్యవేక్షించాలన్నారు. కనీస మద్దతు ధర రైతులు అందరూ సద్వినియోగం చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పి సిఇఒ ఎ.రమణారెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి ఎస్. సూర్యప్రకాశరావు, డిపిఒ భారతి సౌజన్య, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, ఎడి సర్వే బి.లక్ష్మీనారాయణ, డిసిఒ దుర్గాప్రసాద్, డిఎస్ఒ ఎంవి.ప్రసాద్, ఎడి మార్కెటింగ్ నారాయణరావు, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.