ప్రజాశక్తి- రేగిడి : సమాజంలో వ్యవసాయ పరిస్థితులు గండుకాలంగా ఉన్నాయని, అందుకు రైతు బిడ్డలే పారిశ్రామిక వేత్తలగా ఎదిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని శాస్త్రవేత్త, పల్సాస్ గ్రూప్ ఆఫ్ అధినేత గేదెల శ్రీనుబాబు అన్నారు. శనివారం ఉంగరాడ మెట్ట వద్ద శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ దూబ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతు బిడ్డ సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నారు. వలస నివారణకు స్థానిక వనరులు సృష్టించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రకు సాగునీరు అందించడంలో విఫలమయ్యాయని అందుకు ప్రధానమంత్రి మోడీకి ఉత్తరాంధ్ర సమస్యలను వివరించినట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్రలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉండగా, కేవలం 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర చుట్టూ నీరు ఉన్నప్పటికీ సాగునీరుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో రోగులకు డాక్టర్ సాయికృష్ణ, ఎమ్మెస్ జనరల్ సర్జన్ డాక్టర్ సాయి శంకర్, ఎండి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వీణ సరస్వతి, ఎండి పీడియాటిక్స్ డాక్టర్ విజరు శ్రీ, గైనకాలజిస్ట్, శ్రీ విజయలు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 521 మంది రోగులు తనిఖీ చేసుకున్నారు. అవసరమైన రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బూర్జ మాజీ జెడ్పిటిసి అనైపు రామకృష్ణ నాయుడు, బిజెపి మన్యం జిల్లా నాయకులు టంకాల దుర్గారావు, దూబ రాంబాబు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.