ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : వన్ స్టేషన్ – వన్ ప్రొడక్ట్ స్టాల్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. మంగళవారం గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ప్రధాని మోడీ వర్చవల్ విధానంలో ప్రారంభిస్తున్న వన్ స్టేషన్ – వన్ ప్రోడక్ట్ స్టాల్ కార్యక్రమాన్ని స్థానిక బెలగాం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వర్చువల్ విధానంలో రైల్వే శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వికసిత భారత్-నవ నిర్మాణ్లో భాగంగా సుమారు రూ.11లక్షల కోట్లతో రైల్వే వ్యవస్థ ఆధునీకరణకు పనులకు కేటాయించినట్టు తెలిపారు. ఈ సందర్బంగా జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ మాట్లాడుతూ గిరిజనుల ఉత్పత్తులను దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. ప్రతి ఏటా గిరిజనులు పండించిన పంటలకు మద్దతు ధరను కల్పిస్తూ, సంక్షేమ ఫలాలను గిరిజనులకు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, జిల్లా బిజెపి అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, రైల్వే చీఫ్ ఇంజనీర్ అశోక్ కుమార్, ఎఐడిఎన్ డాక్టర్ సాలూరు మురళీష్ణ తదితరులు పాల్గొన్నారు.