ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పటిష్టమైన విద్యా పునాదిని వేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాబా మెట్టలోని బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొత్తం 156మంది విద్యార్థులకు ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బాబామెట్టలోని ప్రాథమికోన్నత పాఠశాలను మహిళా జూనియర్ కాలేజ్గా మార్చాలన్నది తన ఆలోచనని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శ్రావణి, లయాయాదవ్, కార్పొరేటర్ గాదం మురళి, ఎంఇఒ రాజు, హెచ్ఎం పి.రమణమ్మ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/mla-3.jpg)