పల్నాడు జిల్లా: ప్రస్తుతం రాష్ట్రంలో విలేకరులపై పత్రిక కార్యాలయాలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే భవిష్యత్తులో విలేకరి వృత్తి లోకి రావాలంటే కుంగ్ఫూ, కరాటే వచ్చిన వారు ఉండాల్సిన పరిస్థితి దాపురిస్తుందా అనే అనుమానం కలుగుతోందని ఏపీడబ్ల్యూజే పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు నంద్యాల జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పై దాడిని ఖండించారు. ఏపీ డబ్ల్యూజే పల్నాడు జిల్లా కమిటీ , నరసరావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మానవ హారంగా ఏర్పడి, దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో కార్యనిర్వహణ అధికారికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.