దేచవరం సచివాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న జెసి
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : గ్రామోదయం నవోదయం కార్యక్రమంపై శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేకాధికారలు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బంగారుతల్లి కార్యక్రమంపై తల్లుల్లో అవగాహన కల్పించాలన్నారు. వేసవి రానున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. 10 వతరగతి పరీక్షలకు సన్నద్దమవుతున్న విదార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా చర్చించి వారి వారి పిల్లలు పరీక్షలు బాగా రాసేలా అవగాహన కల్పించాలన్నారు. పిల్లలపై హెచ్ఎంలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామోదయం/నగరోదయం కార్యక్రములో గుర్తించిన సమస్యలకు ఎంతవరకు పరిష్కారమయ్యాయో వివరాలు అడిగారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – నకరికల్లు : గ్రామోదయంలో భాగంగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ మండలంలోని దేచవరంలో పర్యటించారు. రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించారు. పాల వెల్లువ లబ్ధిదారులతో అమూల్ కేంద్రానికి పాలు పోసే విధానం గురించి వివరించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో గర్భిణులకు పోషక ఆహార కిట్స్ పంపిణీ, ప్రభుత్వం అందజేసిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టారో లేదో? తెలుసుకున్నారు. ఏపీ మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. మంచి మార్కులు తెచ్చుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. జెసి వెంట మండల ప్రత్యేకాధికారి బాలునాయక్, తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో జయమణి, వైసిపి మండల కన్వీనర్ బి.రాఘవరెడ్డి ఉన్నారు.