ఫొటో : డాక్టర్ రామ్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం
వైద్యులకు ఆదర్శప్రాయుడు డాక్టర్ రామ్
ప్రజాశక్తి-కావలి : డాక్టర్లకు ఆదర్శప్రాయుడు ప్రజా వైద్యులు, జనం మనిషి, నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (డాక్టర్ రామ్) అనిడాక్టర్ రామ్సెంటర్ చైర్మన్ డి.మనోహరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం డాక్టర్ రామ్ జయంతి కార్యక్రమాన్ని డాక్టర్ రామ్సెంటర్ విశ్వోదయ ఆధ్వర్యంలో ముసునూరు గిరిజన కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ రామ్ ప్రతిభావంతులైన వైద్యుడు అని, అత్యవసర సమయాల్లో బ్లేడుతో కూడా ఆపరేషన్ చేసేవారని తెలియజేశారు. ప్రాథమిక వైద్యంపై ఉపాధ్యాయులకు, యువకులకు, సాంఘిక కార్యకర్తలకు ఆయన ప్రథమచికిత్స నేర్పించారని, తద్వారా వేలాది ప్రాణాలను రక్షించగలిగారని కొనియాడారు. డాక్టర్ రామ్సెంటర్ డైరెక్టర్ కె.తాతిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రామ్ కొన్ని వేలమంది పేదలకు ఉచితంగా వైద్యం అందించిన మానవతా మూర్తి అని తెలియజేశారు. బీడీ కార్మికుల, రిక్షా కార్మికుల న్యాయమైన కోరికల కోసం కూడా అనేక పోరాటాలు చేసి, వారికి న్యాయం చేశాడన్నారు. సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రామ్ మనస్సున్న డాక్టర్ అని, పేదల పెన్నిధి, అభ్యుదయవాది, మారుమూల గ్రామాలలోని ప్రజలకు వైద్యం అందాలని బేర్ ఫుట్ డాక్టర్లను తయారు చేశారని, ఎందరో వైద్యులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో డాక్టర్ రామ్ ఆశయాలతో ప్రజావైద్యశాలలను స్థాపించి ప్రజలకు వైద్యసేవలను అందించటం మనం చూస్తున్నామని కొనియాడారు. స్థానిక గిరిజనులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గిరిజన మహిళా నేతలు జ్యోతి, చెంచమ్మ, తదితరులు పాల్గొన్నారు.