ప్రజాశక్తి- డెంకాడ : వైసిపితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు అన్నారు. మండలంలోని మోపాడలో రూ.43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, రూ.12లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని వారు శుక్రవారం ప్రారంభించారు. చింతలవలసలో రూ. 43.60 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా నూతనంగా నిర్మాణం చేసిన వాటర్ ట్యాంక్ ద్వారా ఇంటింటి కుళాయిలను ప్రారంభించారు. సింగవరం రూ.43.60లక్షల నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు, జెడ్పిటిపి బడ్డుకొండ లక్ష్మీ, వైస్ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు, ఎఎంసి చైర్పర్సన్ చిక్కాల అరుణ కుమారి, నగర పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ చిక్కాల సాంబ, జేసియస్ కన్వీనర్లు, రాష్ట్ర డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు బొబ్బిలి: మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, సిసి రోడ్లును ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు మంచి చేయాలన్న సదుద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందజేయడంతో పాటు పంటకు అవసరమైన మందులను పంట కోత అనంతరం గిట్టుబాటు ధరను కల్పిస్తూ ధాన్యం సేకరణను చేపట్టిందన్నారు. ఒకప్పుడు రైతులు తమకు విత్తనాలు కావాలంటే రోజుల తరబడి మండల కేంద్రాల వద్ద నిరీక్షించే పరిస్థితి ఉండేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి స్వస్తి పలికామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మీ, వేణుగోపాలనాయుడు, జెడ్పిటిసి సంకిలి శాంతకుమారి, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, సర్పంచ్ గంట సింహాచలం, సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు..