ప్రజాశక్తి – సామర్లకోట రూరల్
చీకటి జిఒలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎంఎల్ఎ, టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. స్థానిక అచ్చంపేట వద్ద గల ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జిఒ నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక చీకటి జిఒలను తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందని, అన్ని వర్గాల ప్రజలపై భారాల మోపి ఇబ్బందులకు గురి చేసిందని, ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ తనయుడు నిమ్మకాయల రంగనాగ్, పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్, మాజీ ఎంపిటిసి వింటి సుబ్బరాయన్, తదితరులు పాల్గొన్నారు. అలాగే సామర్లకోట మటన్ సెంటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం పోవాలని సైకిల్ ప్రభుత్వం రావాలని కోరుతూ భోగిమంటల్లో చీకటి జిఒలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యార్లగడ్డ చిన్ని, కంటే బాబు, గొల్తి సత్యనారాయణ, కౌన్సిలర్ బలుసు వాసు పాల్గొన్నారు.