ప్రజాశక్తి – కొమరాడ : శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు విశాఖ రేంజ్ డిఐజి హరికృష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు చెందిన పలు రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఎఒబి పోలీస్టేషన్లో ఎప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే అంతర్ రాష్ట్ర రహదారులకు సంబంధించి వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రహదారులపై నుంచి నిషేధిత వస్తువులు అక్రమంగా రవాణా అవుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ముఖ్యంగా గంజాయి, మద్యం వంటి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం విడిచిపెడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నాటు సారా నిర్మూలనకు ప్రజల నుంచి సహకారం అవసరమన్నారు. మద్యం, నాటు సారా అక్రమ అమ్మకాలపై పోలీసులకు ప్రజల్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, వివిధ పోలీసు అధికారులు ఉన్నారు. సాలూరు రూరల్ : స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ను విశాఖ రేంజ్ డిఐజి ఎస్.హరికృష్ణ ఆదివారం సందర్శించారు. స్టేషన్లో రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించారు. సంక్రాంతి, శంబర జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట ఎస్పి విక్రాంత్ పాటిల్, ఎఎస్పి సునీల్ సేయోరెన్, రూరల్ ఎస్ఐ ప్రయోగ మూర్తి ఉన్నారు.