ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా మంగళవారం ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల 14వరోజు సమ్మెకు చేరింది. కార్యక్రమంలో భాగంగా ఎస్ఎస్ఎ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉరితాడు బిగించుకొని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ సమ్మెకు ఎపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సిఎం జగన్ సర్వశిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో మానవ హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ వంగల దాలినాయుడుతో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు రమేష్, లక్ష్మణరావు, భారతి, వందన, దమయంతి, పోలినాయుడు, ఈశ్వరరావు, రమేష్, భాను, దివాకర్, అప్పారావు, దేవిశ్రీ, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/ssa-2.jpg)